RSS
Facebook
Twitter

Saturday, 28 May 2011

ఈ రోజు తారకరాముని జయంతి

ఈ రోజు నందమూరి తారక రామారావు గారి పుట్టిన రోజు. తెలుగువాళ్ళ
ఆత్మ గౌరవాన్ని నిజంగా తెలుగు నేలపై నిలబెట్టిన మహనీయుడాయన.
తెలుగు వాళ్లనే ఒక జాతి వుందనీ , ఉత్తరభారత దేశప్రజలకూ చాటి
చెప్పిన గొప్ప వ్యక్తి రామారావు. మనల్ని మద్రాసీలుగా పిలవబడుతుంటే
" తెలుగు " వాణిని పార్లమెంటులో వినిపించాడు. మామూలుగా దీనికి కూడా
మన తెలుగు వాళ్ళు కొందరు హర్షించలేదు. "తెలుగు తెగులు ": అంటూ
ఎగతాళి చేసి మనం తెలుగువాళ్ళమని నిరూపించుకొన్నారు. బాపు రమణ
గార్లచే పిల్లలకు తెలుగు పాఠాలు తయారు చేయించి, ఆ తెలుగు ప్రముఖులు
ఇద్దరినీ ఉచితరీతిన సత్కరించాడు.
ఇక నటుడిగా అనితర సాధ్యంగా వివిధ పాత్రలను తెరపై అవిష్కరించారు.
రాముడు, కృష్ణుడు ఇలానే ఉంటారు అని పించారు. ఇలాటి మహానటుడి
మైనం బొమ్మను ప్రదర్శనలో( Madame Tussaud) వుంచకబోవటం ఆయనా
.ఓ తెలుగు నటుడిగా పుట్టడమే !!

శ్రీ నందమూరి తారకరామారావు లాంటి ప్రముఖ తెలుగు వ్యక్తి పుట్టిన రోజునే
నా పుట్టిన రోజు కావడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడి
ఈ ఫొటో నా చిన్ననాటిది. ఈ రోజుతో 70 సంవత్సరాలు పూర్తిచేసుకొని 71లోకి
అడుగు పెడుతున్నా ఇంకా నా ఆలోచనలు యవ్వనంగానే వున్నాయి. దీనికి
కారణం భగవంతుడు నాకు ఇచ్చిన మంచి కుటుంబం, నాపై అమిత ప్రేమాభి
మానాలు చూపించే మితృలు ! అందరికీ నా శుభాకాంక్షలు !!

Tuesday, 24 May 2011

నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి అన్నారు ఆత్రేయ. కన్నీళ్లను ఇంగ్లీషులో
" టియర్స్" అని అంటారుగానీ, ఏడిస్తే, నవ్వితే వచ్చే ఆ కన్నీళ్ళు కళ్ళనుంచే
వస్తాయి కాబట్టి " ఐస్ " వాటర్ అని అంటే కాస్త హాస్సెంగా వుంటుంది కదా?
కన్నీళ్ళ రుచి ఉప్పగా వుండటానికి కారణాన్ని ప్రఖ్యాత రచయిత జనార్దన
మహర్షిగారు తన " వెన్నముద్దలు " పుస్తకంలో సరదాగా ఇలా చెప్పారు.
"ఎన్ని చేపల
ఏడుపో...
సముద్రం ఉప్పు..!
మరోచోట ఇలా అన్నారు :
"ఎందుకా ఏడుపు
ఎవడు పోయాడట ?
పక్కింటోడు
ఎదిగిపోయాడట !!



భార్యాభర్తలు సినిమాలో ఓ డైలాగు, " ఏడ్చే మొగాడిని, నవ్వే ఆడదాన్ని నమ్మ
కూడదు" ఇక పిల్లలు, పెళ్ళాలు తమ కోర్కెలు తీర్చుకోడానికి ఏడ్పు మంత్రం
చదువుతారని!. పిల్లల విషయంలో మాత్రం దీనికి కారణం అమ్మా నాన్నలే! ఇక
ఈ కాలంలో ఆడవాళ్ళు అలా "ఐస్" వాటర్ కురిపించి చీరలో, నగలో భర్తలచేత
కొనిపించుకోవటం లేదు. భర్తలే వాళ్ళు ఇంట్లో తమకు, పిల్లలకు చేసే సేవలకే
"ఐస"యిపోయి వారి కోరికలు తీరుస్తున్నారు. కానీ పిల్లలకు ఏడిస్తే తమ పనులు
సాధించుకోవచ్చు అన్న అలవాటును పెద్దలు చెస్తే చివరకు వాళ్ళే ఏడుపు ముఖం
పెట్టాల్సి వస్తుంది. " ఏడవకు ఏడవకు వెర్రి పాపాయి ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు"
అని బుజ్జి పాపాయిలను ఆటపాటలతో మరిపించవచ్చు కానీ పెద్దపిల్లలను ఏడ్చి
నప్పుడల్లా చంకనెక్కించుకొంటే నడుమునొప్పితో ఏడవలసి వస్తుంది. ముఖ్యంగా
ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అక్కడ వున్న బొమ్మో మరోటో కావాలని ఏడుపు
లంకించుకోవటం ఆ ఇంటివారికీ, మనకూ ఇబ్బందే! బుజ్జిపాపాయిల ఏడుపు
ఉంగా ఉంగా అంటూ విన సొంపుగానే వుంటుంది.అదీకాక వాళ్ళు ఎంత ఏడిస్తే
ఊపిరితిత్తులకు అంత బలమనే మన పెద్దలు " బాలానాం రోదనం బలం " అన్నారు!
ఇక కొందరు వాళ్ళకు ఏ బాధలు లేకపోయినా ఎదుటివాళ్లని చూసి ఏడుస్తునే
వుంటారు ఎదుటవాడి అబ్బాయికో అమ్మాయికో మంచి మార్కులొచ్చి మెడిసనులోనో
ఇంజనీరింగ్ లోనో సీటొస్తే " ఆ ఊరికే సంబరపడిపోతున్నాడు.రేపు ఫీజులు కట్టేటప్పుడు
తెలుస్తుంది " అంటూ ఏడుస్తుంటారు. మా హాసంక్లబ్ కార్యక్రమాలకు ఏనాడూ రాని
ఓ పెద్దమనిషి "మీరు హాలు సగానికిపైగా జనాలువచ్చారన్నారు, సగంహాలు ఖాళీట
గదా" అని ఓ వెకిలి ఏడుపునవ్వు నవ్వుతుంటాడు. ఇది అతనికి ప్రతిసారి అలవాటైన
ఏడుపు.

ముళ్లపూడి రమణగారి "బుడుగు" బుజ్జిపాపాయిల ఏడుపు గురించి ఇలా చెప్తాడు.
"చిన్ని పాపాయికి కోపంవస్తే వాడు కేరుకేరుమని, యాయా అని ఘట్టిగా చాలాసేపు
చెప్తాడన్నమాట.!" ఇంకా ఏడుపు గురించి బుడుగు బోల్డు సంగతులు చెప్పాడు.
"ఏడిస్తే బామ్మ రూపాయిస్తుంది. ఇక లావుపాటి పక్కింటి పిన్నిగారు ఉందా,.వాళ్ళ
మగుడు దానికి ప్రెవేటు చెప్పేస్తాడా, అప్పుడేమో అది యిలా యేడుస్తూ బామ్మ
దగ్గరకి వస్తుందా, బామ్మేమో యేడవకమ్మా అని దానికి కాఫీ యిస్తుంది". అంటే
ఏడుపువల్ల కొన్ని సమయాల్లో లాభాలున్నాయని మన బుడుగు చెప్తాడు.

రాజకీయనాయకుల్ని కవ్వించి ఏడ్పించే కార్టూన్లు మనల్ని మాత్రం నవ్విస్తాయి.
అంటే వాళ్ళేడుస్తుంటే మనం నవ్వుతామన్నమాట! అంకెల్లో ఏడు సంఖ్య అంటే
చాలామంది ఇష్టపడరు. దేన్నైనా లెక్కపెట్టేటప్పుడు ఏడు సంఖ్యరాగానే ఆరున్నొక్కటి
అంటారు. ఏడిస్తే వాడు ఆరున్నొక్కరాగం తీశాడు అంటారు. మన అమితంగా
అభిమానించేవారికి ఏదైనా దుఖం, కష్టం కలిగినప్పుడు మనకు కన్నీరు వస్తుంది.
అందుకే ఇలాటి సంధర్భాలలో ఏడుస్తున్నవారిని ఏడవనివ్వమంటారు. అలా ఏడిస్తే
మనసు తేలిక పడుతూందని, రోగ నిరోధక వ్యవస్త మెరుగు పడుతుందని చెబుతారు.
బాధకలిగినప్పుడు ఏడ్చేది మానవులు మాత్రమే! మిగతా జంతుజాలం వాటికి వచ్చిన
శారీరక బాధలను మరోవిధంగా , అరుపుల ద్వారా తెలియపరుస్తాయికానీ కన్నీళ్ళు
కార్చవు. అంతేకాదు తోటి జంతువులు బాగుంటే మన మానవుల్లా అవి ఏడవవు!!
(కన్నీళ్ళ కార్టూన్లతో మనని నవ్వించిన బాపుగారికి కృతజ్ఞతలతో)

Friday, 20 May 2011

ఊమెన్ కేరళ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ కార్టూనిస్ట్ ! ఆయన
గురించి మన బ్లాగరు మితృలు శ్రీ కప్పగంతు శివరామప్రసాద్ గారు
తన saahitya-abhimaani.blogspot.co ద్వారా ఇదివరలో తెలియ
జేశారు.

ఆంధ్ర సచిత్రవార పత్రిక సంపాదకులు శ్రీ శివలెంక రాధాకృష్ణగారు
శ్రీ ఊమెన్ కార్టూన్లను వారం వారం మొదటి పేజీలో ప్రచురించే వారు.
తెలుగులోకి అనువాదం చేసి ప్రచురుణ జరిగేది నా దగ్గర వున్న ఆయన
కార్టూన్లను మీ ముందు వుంచుతున్నాను.
శివసేన నేత బాల్ ధాకరే కూడా మంచి కార్టూనిస్టే! ఆయన రైల్వేలలో
అవినీతి పై గీసిన కార్టూన్ చూడండి.

Thursday, 19 May 2011



ఈనాటి తెలుగు దినపత్రికలలో పాఠకుల దృష్టి పడేది మొట్టమొదట
ఆనాటి కార్టూన్లమీదే! కార్టూన్లకోసం పత్రికలు కొనే నాలాంటి వాళ్ళు
చాలా మంది ఉంటారని నా నమ్మకం. నిన్న జరిగిన రాజకీయాలన్నీ
ఒక్క గీతలో మన కళ్ళముందు ప్రత్యక్షంచేస్తాడు కార్టూనిస్ట్ !. ఇది
వరలో రాజకీయ కార్టూన్లకు ప్రఖ్యాత కార్టూనిస్ట్ శంకర్ పిళ్లై గారి
"శంకర్స్ వీక్లీ " వుండేది. శ్రీ శంకర్ నెహ్రూ మీద వారం వారం ఎన్నో
కార్టూన్లు గీసేవారు. ఆ కార్టూన్లకోసం నెహ్రూజీ ఆతృతతో ఎదురు
చూసేవారట1 ఈనాటి నాయకులు తమపై వచ్చిన కార్టూన్లను చూసి
కిసుక్కున నవ్వు కోవడం మాని విసుక్కుంటున్నారు, నసుక్కుంటున్నారు.
ఈనాడు, ప్రముఖ వార్తా పత్రికలలో రాజకీయ వ్యంగ్య చిత్రాలు గీసే
శ్రీధర్(ఈనాడు), సురేంద్ర ( ది హిండూ), శేఖర్ (ఆంధ్రజ్యోతి) మన
తెలుగు వాళ్లయినందుకు గర్వించాలి. మీకు మరో విషయం తెలుసా
"ఈనాడు" ప్రారంభించిన కొత్తలో ప్రఖ్యాత రచయిత, కార్టూనిస్ట్
శ్రీ సుధామ (శ్రీ అల్లంరాజు వెంకటరావుగారు) పాకెట్ కార్టూన్లు వేసే
వారు. అలనాడు " ఈనాడు "లో శ్రీ సుధామ గీసిన పాకెట్ కార్టూన్
మీ కోసం.
ఇక్కడ మీరు చూస్తున్న కార్టూన్లు ఈనాడు, ది హిండూ, శ్రీ శేఖర్ గారి
పారాహూషార్ సౌజన్యంతో.

Wednesday, 18 May 2011

కోతి మూకబుర్లు !!



మరీ అల్లరి చేసే పిల్లల్ని కోతిమూక అంటాం. ఏవియస్ కోతిమూక
పేరిట ఓ సినిమాయే తీసేశాడు. కొందరు పెద్దమనుషుల నడవిడిక
చూస్తుంటే పిల్లల అల్లరికన్నా, కోతులు చేసే గోల కన్నా ఘోరంగా
వుంటుంది. నిజానికి కోతులు ఆ చెట్టుమీద నుంచి ఈ చెట్టుమీదకీ
ఆ కొమ్మ నుంచి పైకీ , కిందికీ సందడిగా దూకుతూ మంచి వినోదాన్నే
కలిగిస్తాయి. ఈ నాడు వచ్చే సినిమాల్లోని కొందరు హాస్యగాళ్ళ(క్షమించాలి),
నాయకీ నాయకుల కంటే కోతి గెంతులే మంచి వినోదాన్ని కలిగిస్తాయి కదూ?!
కోతులు కొమ్మల మీద చేసే విన్యాస్యాల్నే కోతికొమ్మచ్చి లంటారు.
శ్రీ ముళ్లపూడి వెంకట రమణగారు కోతికొమ్మచ్చి పేరిట రాసుకున్న తమ
ఆత్మ కధ, ఇంకోతి కొమ్మచ్చిగా రెండోభాగం కూడా విడుదలై విశేష పాఠక
ఆదరణపొందింది. రాబోయే జూన్ 28 నాటికి రమణగారి పుట్టిన రోజుకు మరో
కోతి కొమ్మచ్చి మన ముందుకు "ముక్కోతి కొమ్మచ్చి"గా మనముందుకు
హాసం బుక్స్ ద్వారా రాబోతున్నది. ఇక అమెరికాలో తెలుగొచ్చి చదవటం
రాని మన తెలుగు వాళ్లకోసం యస్పీ.బాలు ,శ్రీ వరప్రసాదరెడ్డి గారల గాత్రంతో
వినే కోతికొమ్మచ్చులు విడుదలయ్యాయి.
రామాయణంలో సీతాన్వేషణలో వానరసేన ఎంత ప్రాముఖ్యం వహించిందో
మనకు తెలుసుగా! సీతాదేవిని కనుగొని ఆ విషయం హనుమంతుడు
తెలియజేయగానే యువరాజు అంగదుడు వానరులకు మధువనంలోకి
ప్రవేశానికి అనుమతించాక వనంలోని తేనె నంతా తాగినంత తాగి మిగతా
తేనెను ఒలకబోసి ఆ మధువు మత్తులో నానా గోలా చేస్తారు వానరులు.
అంటే అంగదుడు తన సేవకులకు గొప్ప పార్టీ ఇచ్చాడన్నమాట. అందు
వల్లనేమో తాచెడ్డ కోతి వనమెల్లా చెరచింది అన్న నానుడి వచ్చిందేమో1
ఇక మన వానరమితృలపై ఎన్నెన్నో సామెతలున్నాయి. కోతికి కొబ్బరి
కాయ దొరికినట్టు, కొండమీద కోతి ఇలా! జున్నుముక్కను పంచుకోడంలో
తగవులు పడి తీర్పుకోసం కోతి దగ్గరకెళ్ళిన పిల్లులకధను మనం చిన్నప్పుడు
చదువుకున్నాం ! దీన్నే మార్జాల మర్కటన్యాయం అంటారు. జంగిల్ బుక్
కధలో కోతులు వాటి రాజ్యంలో మౌగ్లీని అల్లరి పెట్టిన తీరు తెలుసుకదా!
మనం కోతులనుంచే పుట్టామని డార్విన్ సిద్ధాంతం చెబుతున్నది. వాటికి
మనకు చాలా పోలికలున్నాయి. ముఖ్యంగా చెవులు చూడండి. అచ్చు మనకి
లాగానే వుంటాయి. పిల్లలు పెద్దలు కూడా ఎక్కడ కోతులు అగుపడ్డా కోతుల్లా
ఎగబడి చూస్తారు. కవ్విస్తారు ! శ్రీ బాపు గారు జూలో కోతులు లావాటి పిన్ని
గారిని చూసి కిచకిచలాడుకోవటం ఎంత చక్కగా వేసారో ఛుశారుగా! కోతి తెలివికి
మొసలి-కోతి కధ ఒక ఉదాహరణ.
"మల్లీశ్వరి" లో భానుమతి పాడిన కోతీబావకు పెళ్ళంట అన్న పాట
విన్నారుగా!
ఇక కోతి కబుర్లకు ఫుల్ స్టాప్ పెట్టేద్దాం! మరీ ఎక్కువైతే కోతిపుండు
బ్రహ్మరాక్షసి అవుతుంది !
  • Blogger news

  • Blogroll

  • About