RSS
Facebook
Twitter

Thursday, 9 December 2010



హనుమాన్ చాలిసా, శ్రీ రామకధాగానం విన్న వారికి శ్రీ ఎమ్మెస్ రామారావుగారి
మధుర స్వరం కలకాలం వినిపిస్తూనే వుంటుంది. "శ్రీ హనుమానుల గురుదేవులు
నా యెద పలికిన సీతారామ కధా..నే పలికిన సీతారామకధ" అంటూ మధురంగా
గానం చేశారు రామారావు గారు. "సుందరదాసు" గా అభిమానులు ఆయనకు
బిరుదునిచ్చారు. శ్రీ రామారావు తెలుగు సినిమాలలో తొలి నేపధ్య గాయకుడిగా
ప్రవేశించారు. ఆ కాలంలో పాట పాడగలవారికే నటించే అవకాశం దొరికేది కాబట్టి
నేపధ్యగాయకుల అవసరం వుండేది కాదు. తరువాత కాలంలో చిత్రపరిశ్రమలో
వచ్చిన మార్పులతో రామారావు గారికి నేపధ్యగాయకుడిగా అవకాశం దొరికి
20 ఏళ్ళపాటు గాయకుడిగా కొనసాగి ఎన్నెన్నో మధుర గీతాలను ఆలపించారు.
తెనాలి తాలూకా, మోపర్రులో జూలై 3, 1921 న సీతారామారావు జన్మించారు.
గుంటూరు హిందూ కాలేజీలో చదువుకొనే రొజుల్లో అంతర కళాశాలల లలిత
సంగీత పోటీల్లో శ్రీ రామారావు మొదటి బహుమతి గెలుచుకున్నారు. ఆనాటి
కార్యక్రమాలకు జడ్జిగా వచ్చిన అడవి బాపిరాజు సినిమాలలో ప్రయత్నించమని
ప్రోత్సహించారు. ప్రఖ్యత హిందీ గాయకుడు సైగల్ పాటలు పాడేవారు శ్రీ రామారావు.
ఆయన గొంతు కూడా సైగల్ స్వరాన్నిపోలివుందని మితృలు ప్రోత్సహించేవారు.
సముద్రాలతో పరిచయం వుండటం చేత ఆయన ద్వారా పరిశ్రమకు పరిచయమయ్యారు.
సి.ఆర్.సుబ్బరామన్ సంగీత దర్శకత్వం లో సముద్రాల వ్రాసిన కూలీలం, వల్లదంటే
కోపమా అన్న రెండు పాటలను శ్రీ రామారావు పాడగా ప్రవైట్ రికార్డుగా విడుదలయింది.
అటుతరువాత " దేవత " సినిమాలో "ఈ వసంతము నిత్యము కాదు..పూవు దొన్నెలో
తీయ తేనియ లేదు" అన్న పాటలను పాడారు. ప్రముఖ నిర్మాత కె.యస్.ప్రకాశరావు
తను నిర్మించి దర్శకత్వం వహించిన "ద్రోహి " చిత్రంలో (1948) లో జి.వరలక్ష్మితో కలసి
"ప్రెమేకదా" పాటను పాడారు.ఆచార్య ఆత్రేయ గీతం "పోరా బాబూ పో" (దీక్ష) ,తెలుగు,
తమిళ భాషల్లో పాడారు. రామారావు తెలుగుతో బాటు తమిళ, హిందీ (రామదాసు)లో
కూడా పాటలు పాడారు. పాండురంగ మహత్య్మం లో వేషమేయటమే కాకుండా పాటను
పాడారు. ఆనాటి హిరో సిహెచ్.నారాయణరావుకి రామారావుగారే ప్లేబ్యాక్ పాడేవారు.
తరువాత కాలంలో పోటీ పెరిగిపోవటం చేత రాజమండ్రి వచ్చి తన్నీరు బుల్లయ్యగారి
గురుకుల పాఠశాలలో ఉద్యోగంలో చేరారు. ప్రతి నెలా మా స్టేట్ బ్యాంకుకు పాఠశాల
జీతాల చెక్కు మార్చడానికి శ్రీ రామారావు వచ్చేవారు. అక్కౌంటెంట్ గా అప్పుడు
బ్యాంకులో పని చేస్తున్న నాకు ఆయనతో పరిచయ భాగ్యంకలిగింది. 1992 ఏప్రియల్
20 వ తేదీన యుద్ధకాండ గేయ రచన చేస్తూ ఆయన కన్నుమూయగా ఆయన రెండో
కుమారుడు శ్రీ నాగేశ్వరరావు పూర్తి చేశారు. శ్రీ రామారావుగారి మనువడు శ్రీ .శ్రీనివాస్
సుందరకాండ గానాన్ని ముమ్మూర్తులా తాతగారిలా గానం చేస్తున్నారు.

Wednesday, 8 December 2010

సూపర్ డూపర్ హిట్ " లవ కుశ "


మార్చి 29, 1963 లో విడుదలయిన లలితా శివజ్యోతి వారి "లవకుశ"
సూపర్ డుపర్ హిట్టయింది!
. ఆ రోజుల్లో "లవకుశ " చిత్రం అఖండ విజయం సాధించింది.
ఆ సినిమా నిర్మాణానికి చాలా సంవత్సరాలు పట్టింది. లవకుశ పాత్ర
ధారులు కొన్ని సీన్లలో పెద్ద వాళ్లుగా మరి కొన్నిసీన్లలో మళ్ళీ చిన్న వాళ్ళుగా
అగుపిస్తారు!. సీతా దేవి తలలో పువ్వులు కూడా తరచు రంగులు మారిపోయేవి !
అయినా ప్రేక్షకులు ఇవేవీ పట్టించుకోలేదు. శ్రీమతి అంజలీదేవిని సీతాదేవిగానే
చూశారు. ఇక యన్టీయార్ ముమ్మూర్తులా రాముడి లానే వున్నారు. ఘంటసాల
అందించిన సంగీతం ఈ నాటికి చిరంజీవిగా నిలచింది. గేవాకలరులో నిర్మించిన
ఈ చిత్రానికి సి.పుల్లయ్య దర్శకులు. ఆయన కుమారుడు సి.యస్.రావు కూడా
దర్శకత్వ భాధ్యతలను నిర్వహించారు. ఆ రొజుల్లో "లవకుశ " రోజుకు మూడు
ఆటలతో రజతోత్సవాలు జరుపుకుంది. ఆ కాలంలో శని ఆది వారాల్లో తప్ప
మాటనీ షోలు వుండేవి కాదు.
సి.పుల్లయ్య గారి గురించి రెండు మాటలు. రాజమండ్రిలో దుర్గాసినీటోన్ అనే
సినిమా స్టూడియో వుండేది. పుల్లయ్య గారు ఆ స్టూడియోని తీసుకొని "మోహినీ
భస్మాసుర" (1938), " సత్యనారాయణవ్రతం" తీశారు. "సత్యనారాయణవ్రతం" చిన్న
సినిమాగా వచ్చిందని, " కాసులపేరు" అన్న సాంఘిక చిత్రాన్ని తీసి కలిపి ప్రదర్శించారు.
అన్నవరం దేవాలయం పై ఒక డాక్యుమెంటరీ, తీసిఅది కూడాకలిపి ఒకే ఆటలో
ఎన్నో సినిమాలు అంటూ ప్రచారం చేశారు.

Friday, 3 December 2010

ఓ "రేపు" కధ !!





మన పెద్దలంటారు. ఈ రోజు గురించి కాదు, రేపటి గురించి ఆలోచించమని.
రేపు అన్న పదానికి ఈ రోజుల్లో మహ చెడ్డపేరొచ్చింది ! న్యూస్ పేపర్లలో,
ఎలట్రానిక్ మీడియాల్లో ప్రతి రోజు రేపు అగుపిస్తూ అసలు "రేపు" కు
అర్ధాన్ని మార్చి పారేసింది. అసలు పేపర్లలో ఈనాడు మనం చదివే
రేపు వార్తలు నిజానికి నిన్నటివే! ఇక అసలు రేపు గురించే చెప్పుకుందాం!
ప్రతి వాళ్ళు రోజులు మారుతాయేమో నని రేపటి రేపు గురించి ఆత్రంగా
ఎదురు చూస్తుంటారు. రేపటి కోసం తను అనుభవించకుండా విపరీతంగా
పొదుపులు చేసే పిసినారులూ వున్నారు. రేపటికోసం కొంత దాచుకోవటం
మంచిదే కానీ అందుకోసం అన్ని అడ్డదారుల్లొ సంపాదించుకోవడం అవసరమా?
రేపు మాటను వ్యాపారస్తులు అరువులడిగే తమ ఖాతాదారులు ఇబ్బంది
పడకుండా కొట్టు బయట పెద్ద అక్షరాలతో " అరువు రేపు" అన్న బోర్డు తగిలిస్తారు.
రేపైనా మంత్రి పదవులు రాక పోతాయా అని ఆశావహులు ఆ రేపటి కోసం గుంట
నక్కల్లా ఎదురుచూస్తుంటారు. పదవి వచ్చాక మంచి పోర్టుఫోలియో గురించి
మరో రేపు కోసం ఎదురుచూస్తారు. ఎవడైనా "గాలి" లోంచి డబ్బులు ఎగరేయ
బోతాడా అని శాఖలు నచ్చని మంత్రులు ఆ రేపటి కోసం ఎదురు చూస్తుంటారు.
ఇక సామాన్యుడు రేపైనా మంచి రోజులొస్తాయేమోనని ఆశగా రాబోయే రేపటి
కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటాడు. ఇల్లాటి రేపులను గురించి
తలచుకుంటుంటే నిజంగా భయమేస్తుంది. మన భావితరాలవారికైనా ఓ మంచి
రేపు ఉదయించాలని కోరుకుందాం!
>>>>>>>>>>>>>>>>>>>oOo<<<<<<<<<<<<<<<<<<<<<<<


1957 లో " రేపు నీదే " అనే సినిమా , షావుకారు జానకి ,జగ్గయ్య నాయకీ
నాయకులుగా భాస్కరరావు దర్శకుడిగా విడుదలయింది. ఆ చిత్రం విజయం
సాధించలేదు. అందుకు కారణాన్ని ఒకాయన ఇలా చమత్కరించాడు." రేపు
నీదే" అన్నారుగా నిర్మాతలు, ప్రేక్షకులు కూడా రేపు మనదే గదా రేపు చూద్దాంలే
అనుకున్నారు!"
>>>>>>>>>>>>>>>>>>oOo>>>>>>>>>>>>>>>
బ్లాగులో రేపు ఏం రాయాలి అని ఆలోచిస్తూ ఏం రాయాలో తోచక ఆ "రేపు"
గురించే రాయాలని డిసైడ్ చేసేసా! ఇక రేపటి సంగతి రేపు ఆలోచించొచ్చు!!






Thursday, 2 December 2010

రామప్ప దేవాలయం




వరంగల్లు జిల్లా పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయం వుంది.
రుద్రమదేవి కాలంలో గణపతి రుద్ర దేవుడు 1213 లో ఈ దేవాలయాన్ని
నిర్మించాడట. ఈ ప్రాంతంలో వున్న దేవాలయాలన్నీ అద్భుత శిల్పకళ
తో నిర్మించబడ్డాయి. 1983 లో ఈ దేవాలయం గురించి రామప్ప
దేవాలయం పేర క్రిష్ణారావు కేషవ్ దర్శకత్వంలో ఓ డాక్యుమెంటరీ
నిర్మించారు. శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో
యమ్కే రాము రచనతో ,శ్రీ బాలు గాత్రంతో పాటలు చిత్రీకరించారు.
సంగీత నృత్య ప్రధానమైన పాటలను AVM MUSIC SERVICE
వారు 1983లో 45 RPM Standard Play Record గా ఆ పాటలను
విడుదల చేశారు. చిత్రం అసలు విడుదలయిందో లేదో తెలియదు గాని
నా దగ్గర వున్న ఆ రికార్డును వింటుంటే అద్భుతమనిపించి ఈ వీడియో
ద్వారా మీకు చూపిస్తూ, వినిపిస్తున్నాను. రామప్ప దేవాలయం గురించి
పూర్తి వివరాలు తెలియ రాలేదు.బ్లాగరు మితృలెవరైనా ఫొటోలతో తమ
బ్లాగులో వ్రాస్తారని తలుస్తాను.
.

Wednesday, 1 December 2010

వంటా-వార్పు !





జ్యోతి గారు బ్లాగులో వంటలు వ్రాయమంటూ అడిగితే , నేను రెడీ అవుతుంటే
మీకు కూరలు తరగడంతప్ప చేయడం రాదు గదా అంది నా శ్రీమతి. అదేమిటో
నా కంప్యూటర్ కూడా ఆవిడకు తోడుగా నిలచి, హార్డ్ డిస్క్ ఫట్ మంది! ఎలా
ఐతేనేం, ఓ వారం రోజులకు కంప్యూటర్ బాగై , బ్లాగు రాయటానికి రెడీ అయ్యాక\
ఏమైనా సరే, నాకు బాగా ఇష్టమైన కాకరకాయ గుత్తి కూర రాయాలనిపించింది.
ధైర్యంచేసి మీకా వంట చెప్పేస్తున్నాను. స్వయంగా నే చేసి చూసి మా ఆవిడ
పద్మ చేత WOW అని టీవీల్లో లా అనిపించుకొని మీకు చెబుతున్నా!
ముందుగా చిన్న సైజు కీకరకాయలు, సారీ కాకరకాయలు తీసుకొని చాకుతో
మధ్యలో పొడువుగా చీల్చాలి. బాండీలో ( బాణాలీ/బూర్లెమూకుడు) వాటిని వుంచి
కొద్దిగా నీరు, కొంచెం చింతపండు పులుసు, కొచెం ఉప్పు చేర్చి మూతపెట్టి కొద్ది
సేపు సన్నని సెగపై వుంచి దింపాలి. కాయలు మరీ మెత్తగా ఉడకకూడదు.
మగ్గాలంతే. తరువాత తీసి వెల్లుల్లికారం కూరి నూనెలో వేయించాలి. కొద్దిగా
అలా వుడికించడంవల్ల కూరిన కారం బైటకు పోదు, కాకర చేదు అనిపించదు.
చాలా రుచిగా వుంటాయ్!. ఇది అందరికీ తెలిసే వుంటుంది, గొప్పగా చెప్పాలా?
అని శ్రీమతి అన్నా , నే స్వయంగా నేర్చుకున్నది కనుక, నిజంగా గర్వంగా
వుంది.
ఇక్కడ వంట చేస్తున్నచిన్నది మా రెండో అమ్మాయి మాధవి పాప
చిii జోషిత ,బొంబాయి. ఇక్కడకొచ్చినప్పుడల్లా వంటిట్లోకి చేరి వంట చేస్తానని
గొడవ చేస్తుంది. గత మే నెలలో నే తీసిన ఫొటో. నే వండిన కాకరకాయ గుత్తికూర
ఫొటొలు, టీవీ వంటలపై నా కార్టూన్ .
  • Blogger news

  • Blogroll

  • About