RSS
Facebook
Twitter

Saturday, 15 June 2013

నాన్నల పండుగ

   నాన్నల పండుగ

ధర్మదాత సినిమాలో నాన్నగురించి మనసు కవి ఆత్రేయ ఇలా
అంటారు.
     "ముళ్లబాటలో నీవు నడిచావు
       పూలతోటలో మమ్ము నడిపావు
       ఏ పూట తిన్నావో - ఎన్ని పస్తులున్నావో
       పరమాన్నం మాకు దాచి వుంచావు"
       పుట్టింది అమ్మకడుపులోనైనా-పాలు
       పట్టింది నీ చేతితోనే
       ఊగింది ఊయ్యాలలోనైనా
       నేను దాగింది నీ చల్లని ఒడిలోన
       చల్లని ఒడిలోన"
 అలసిసొలసి నాన్న ఇంటికి రాగానే పిల్లలంతా నాన్న ఒడి
లోకే చేరిపోతారు. నాన్నంటే ఎంత భయం వుంటుందో అంత
ప్రేమ పిల్లలకు వుంటుంది.


మా నాన్నగారు ఆరోజుల్లో బ్యాంకునుంచి ఇంటికి వచ్చేటప్పటికి
చాలా పొద్దుపోయేది. రాత్రి పది గంటలవరకు నాన్నకోసం నిద్ర
ఆపుకొని ఎదురు చూసే వాళ్లం. నెలలో మొదటి వారమైతే ఆయన
మాకోసం తిసుకొని వచ్చే బాల, చందమామలకోసం నేను, అక్క
చెల్లి ఎదురుచూసే వాళ్ళం. మా నాన్నగారికి పుస్తకాలు, పత్రికలు
అంటే చాలా ఇష్టం అమ్మకోసం ఆంధ్రపత్రిక వీక్లీ, గృహలక్ష్మి
(స్త్రీల పత్రిక), తను Illustrated Weekly of India, Sankar's weekly,
Tit-Bits, Reader's Digest  పత్రికలు, Madras Mail దిన పత్రిక ,
ఆదివారం Sunday Stanadard (ఆదివారం ఆ పేరుతో Indian
Express వచ్చేది), ఆంధ్రపత్రిక, ఆంధ్రపభ దినపత్రికలు కొనే
వారు. ఇలా మాకు ఆయన మాకు పుస్తకాల పై అంతులేని
అభిరుచిని పెంచారు.


ఒకసారి స్కూల్లో మా తెలుగు మాస్టారు "మీరు బ్రాహ్మలా?’"
అని అడిగారు. "అవునన్నాను. "వైదీకులా?నియోగులా?"
అని అడిగారు. "తెలియదండీ" అన్నాను.ఆ రోజు రాత్రి నాన్న
గారిని అదే ప్రశ్న అడిగాను. "మనం మనుషులం" అన్నారు,
కొంచెం కోపంగా. నాన్నగారు ఇలాటి విషయాలంటే ఇష్టపడే
వారు కాదు. మాకు ఆదివారం పేపర్లో వచ్చే కామిక్స్ ( బొమ్మల
కధలు ) చదివి చెప్పేవారు. ఆ రోజుల్లో ఇంగ్లీషు సినిమాలు
మా  రాజమండ్రిలో ఉదయం ఆటలు వేసేవారు. మమ్మల్ని
సినిమా మొదట్లో చూపించే కార్టూన్ల సినిమాల కోసం తీసుకుని
వెళ్ళేవారు. కార్టూన్ సినిమాలు వరుసగా బొమ్మలు వేసి ఎలా తీస్తారో
చెప్పేవారు.


ఇలాటి నాన్నలను పిల్లలెలా మర్చిపోగలరు. కానీ ఈ రోజుల్లో
కాలం మారిపోయింది. కొందరు అమ్మలనూ నాన్నలను
వృర్ధాశ్రమాల్లో వుంచుతున్నారు. అందరూ అలా వుంటారని
అననుకానీ వృర్ధాశ్రమంలో వుంచడం ఓ ఫాషనుగా మారిపోయింది.
నాన్నలందరికీ పిల్లలందరీ తరఫున శుభాకాంక్షలు చెబుదాం !!
నాన్నలూ జిందాబాద్ !!


Sunday, 12 May 2013

అమ్మా నీకు వందనం !

       అమ్మ ఎంత తీయనిపదం. మనను ఈ నేల మీదకు
       తీసుకురావడానికి అమ్మ పడె బాధను మర్చి పోయి
       పెంచుతుంది. తను ఆకలితో వున్నా పిల్లలకు పెట్టి
       కానీ అమ్మ ముద్ద ముట్టదు. దెబ్బ తగిలితే అమ్మను
       తెలియని వాళ్ళ నోటి నుంచి కూడా వచ్చేమొదటి
       మాట "అమ్మా!" అనే!

      అమ్మ మీద ఎన్ని పాటలు, ఎన్ని సినిమాలూ వచ్చాయో!
       శ్రీ సినారె " మనుషులు మట్టిబొమ్మలు " చిత్రానికి వ్రాసిన
       ఈ పాట విన్నారనుకుంటాను.
           అమ్మా అని నోరారా పిలవరా
            ఆ పిలుపే అందరు నోచని వరమురా-వరమురా
          పలుపు తెంచుకొని లేగ దూడ
          పరవశించును"అంబా" అని
          గొంతుపెకలని గువ్వ పిల్ల
          కువకువలాడును "అమ్మా"అని
          ఆ పిలుపే ఈ యిలకే
          కమ్మని మమతల కానుకరా
          దేవకి కడుపున వెలసిన కృష్ణయ్య
          తలచె యశోదను "తల్లి" అని
          ఆ తలపే తన అణువణువు నిండగ
          పిలువలేదా " అమ్మా" అని
          ఆ పిలుపే నిను నడిపే - ఆరని వెలుగుల దీపికరా
          అమ్మా అని నోరారా పిలవరా
          ఆ పిలుపే అందరు నోచని వరమురా

    శ్రీ ముళ్లపూడి వెంకటరమణగారు తన సాహితీ సర్వస్వం
     మొదటి భాగం "కధారమణీయం-1"  తొమ్మిది మంది
     తల్లులకు అంకితమిస్తూ ఇలా అంటారు..
          "నన్నుకనిపెంచి
          పెద్ద చేసిన -
           ముళ్లపూడి ఆదిలక్ష్మి
           మహాపతి సూరమ్మ
           కొవ్వలి సత్యావతి
           చల్లా సీతామహాలక్ష్మి
          వీరఘంటం సీతాబాయి
      
          పున్నావఝ్జుల(రేడియో) భానుమతి
          మండలీక సుబ్బులక్ష్మి
          శివలెంక కామాక్షమ్మ
          సత్తిరాజు సూర్యకాంతం
         
          ఈ తొమ్మండుగురు అమ్మలను స్మరిస్తూ"
           జన్మనిచ్చిన అమ్మతోబాటు తనను ప్రేమతో
           ఆదరించిన తల్లులను ఆయన మర్చిపోలేదు.


  మా అమ్మ మట్టెగుంట సీత గారికి సాహిత్యమంటే ఎంతో
 ఇష్టం. తెలుగుపత్రికలన్నీ చదివే వారు. ఆ రోజుల్లో ఆంధ్ర
సచిత్రవారపత్రికలో  ప్రసిద్ధ ఇంగ్లీషు నవలల అనువాదాలు
సీరియల్సుగా వచ్చేవి. వాటిలో మా అమ్మగారికి అలెగ్జాండర్
డ్యూమాస్ రచన కౌంట్ ఆఫ్ మాంట్ క్రిష్టో అంటే చాలా ఇష్టం
పుస్తకరూపంలో ఆ నవల    రెండు భాగాలుగా వెలువడినప్పుడు
కొని తరచు చదివే వారు. ఆపుస్తకం ఇప్పటికీ అమ్మ గుర్తుగా
నా దగ్గర వుంది. నేటి మాతృదినోత్సవం రోజున అమ్మలందరికీ
పాదాభివందనాలు.

Sunday, 5 May 2013

 నవ్వటం నిజంగా నవ్వులాటకాదు. మన నవ్వు మనల్ని నవ్వులపాలు 
చేయకుండా మరొకర్ని నవ్వులపాలు చేయకుండా వున్నప్పుడె ఆ నవ్వుకు
విలువ. అందుకే మేము మా హాసంక్లబ్ లో జోకు చెప్పేవాళ్ళకు, ఒక మతాన్ని
కాని, వర్గాన్నికాని  ఉదహరించకుండా జోకులు చెప్పాలని కోరుతుంటాం.
చాలామంది పంజాబీల గురించి జోకులు చెబుతుంటారు. పంజాబీలలో
ఎంతోమంది మేధావులున్నారు. ఇక అమాయకులు, తెలివి తక్కువవారు
అన్ని రకాలమనుషుల్లోనూ వుంటారు కదా!?


నవ్వు సహజమయిన పెయిన్ కిల్లర్ ! బాధానివారిణి. ఇది టెన్షన్ యుగం!
ఆఫీసునుంచో, షాపింగ్ నుంచో మనం ఇంటికి తిరిగి వస్తుంటే ట్రాఫిక్ తో
ఎంతో టెన్షన్. ఇలాటి ఈ స్పీడ్ యుగంలో మనం ఈ టెన్షన్లనుంచి దూరం
అవాలంటే మంచి జోకుల పుస్తకమో, కార్టూన్ పుస్తకమో మంచి రిలీఫ్ !!
మంచి జోకైనా, కార్టూనైనా ఎన్ని సార్లు చదివినా చూసినా, లేకపోతే జ్ఞాపకం
వచ్చినా కొత్తగానే వుంటుంది. మరో విశేషమేమంటే నవ్వాలంటే మన
ముఖంలో  17 కండారాలకు పనికలిగితే అదే చిరాగ్గా కోపంగా వున్నప్పుడు
43 కండరాలు పనిచేయాలి. అటువంటప్పుడు ఆ కండరాలచేత ఓవర్
వర్క్ చేయించడం ఎందుకు చెప్పండి. అందుకే ఈ నవ్వుల పండుగ రోజే
కాదు ఎప్పుడూ నవ్వుతూనే వుందాం! ఎదుటి మనిషిది ఏ భాషైనా, ఏ దేశం
యైనా మనకు ఎదురైనప్పుడు చిరునవ్వు చిందిస్తే మనం వారికి ఆప్తులవుతాం.
నవ్వుకు భాషలేదుకదా. "శాంతి నవ్వుతో ఆరంభమవుతుంది" అన్న మదర్
ధెరిస్సా మాట మీకు గుర్తుండే వుంటుంది. అందుకే మనం సదా నవ్వుదాం!
నవ్విద్దాం! మనసారా నవ్వుకుందాం !
                            "నవ్వేజనా సుఖినో భవంతు" 



Wednesday, 24 April 2013

పుస్తకాలే మంచి నేస్తాలు

              ఈ రోజు ప్రపంచ పుస్తక  ప్రేమికులంతా పుస్తకదినోత్సవాన్ని
జరుపుకుంటున్నారు. ఈ సమయంలో మన పుస్తకాల చరిత్ర
కధలను మరోసారి నెమరు వేసు కుందాం. కొన్ని వేల ఏళ్లనాటి
నుంచి నాలుగు వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశపురాణాలు
ఈనాటికీ సజీవంగా వున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే.
ముద్రణాసౌకర్యాలు లేని ఆకాలంలో ఒకరి నుంచి ఒకరు నేర్చు
కుంటూ ధారణ శక్తి ద్వారా వీటిని సజీవంగా నిలుపుకుంటూ
వచ్చారు.

 ఇలా వేదాలు చెప్పేవారిని వేదంవారనీ,  రెండు వేదాలు వల్లె
వేసేవారిని ద్వివేదులనీ, మూడు వేదాలపై పట్టుగల వారిని
త్రివేదులనీ, నాలుగు వేదాల దిట్టలను చతుర్వేదులనీ
వ్య్వహరించే వారు. అట్లాగే పురాణాలను ప్రజలకు తెలియజేసే
వారు ’పురాణం’వారుగా వాడుకలోకి వచ్చారు. అటుతరువాత 
వాటిని లిఖిత రూపంగా రాళ్ళమీద, రాగి రేకుల పైనా, తాళ
పత్రాలమీద, ఆ తరువాత కాగితం కనుగొన్నాక దానిపై అచ్చొత్తి
నిక్షిప్తం చేయటం జరిగింది. ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలో
డిజిటల్ రూపంలో మన సాహిత్యమంతా నిక్షిప్తమవుతున్నది.

 పుస్తక ముద్రణ మొదలయ్యాక ఎందరో మేధావులు, రచయితలు
వెలుగులోకి వచ్చి పాఠకులకు విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తూ
సాహిత్య సేవ చేస్తున్నారు. వేలాది సంవత్సరాల చరిత్ర, నాగరికత
లోకమంతా వ్యాప్తి చెందడానికి ఈ గ్రంధ ముద్రణ పక్రియ ఎంత
గానో తోడ్పడింది. చరిత్ర ఒకసారి తిరగ వేస్తే అశోక చక్రవర్తి ,
విలియంకారీ లాటి మహా వ్యక్తులను మనం తప్పక తలచుకోవాలి.
అశోకుడు పాళి లిపిని అభివృర్ధి పరచి భౌధ్ధమత ప్రచారం కోసం
శాసనాలు వ్రాయించి లిపిని ప్రచారంలోకి తెచ్చాడు. బైబిల్ 
ప్రచారం కోసం తెలుగులో 1746-47 లో జర్మనీలో బ్లాక్స్ (BLOCKS)
సాయంతో అచ్చు వేయటం జరిగింది. 1901లో విలియం కేరీ
కలకత్తా దగ్గరలోని శ్రీరాంపూర్ లో అచ్చు యంత్రంలొ కదిలే అచ్చు
అక్షరాలు తయారు చేసి సీసంతో పోత పోయించాడు. అలా ఆ
అక్షరాలతో చేతితో కంపోజింగ్ మొదలయింది.

 మన వేదాలను, పురాణాలను వావిళ్ల రామస్వామి , వెంకట్రామా&కో,
రామా &కో లాటి సంస్థలు ప్రచురించి సాహిత్య ప్రచారానికి అపార
సేవలు కలిగించాయి. అటుతరువాత రాజమండ్రిలో అద్దేపల్లి వారిచే
సరస్వతీ పవర్ ప్రెస్ ప్రారంభించ బడింది. మేము చదువుకునే
రోజుల్లో ఆంధ్రా యూనివర్సిటీ వారి పాఠ్యపుస్తకాలు ఈ ప్రెస్ లోనే
అచ్చయేవి.కొండపల్లి వీర వెంకయ్య & సన్స్ వారు భమిడిపాటి
మొ" ప్రముఖుల హాస్య రచనలు, కధలు ప్రచురించారు. అటు
తరువాత విజయవాడలో విశాలాంధ్ర, నవోదయ, యం.శేషాచలం
& కో సంస్థలు ఎన్నొ రకాల ప్రచురణలు ప్రచురిస్తున్నారు.



తెలుగునాట హాస్య రచయితలకు కొదువలేదు. శ్రీ మొక్కపాటి
నరసింహశాస్త్రిగారి "బారిస్టర్ పార్వతీశం" పాఠకుల వీశేష
ఆదరణ ఈనాటికీ పొందుతూనే వుంది. అలానే శ్రీ ముణిమాణిక్యం
నరసింహారావు గారి కాంతం కధల ద్వారా ప్రశిద్ధి పొందారు.
శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం "గణపతి" హాస్య రచన రేడియో
నాటకంగా కూడా ప్రశిద్ధి పొందింది. ఇక్కడో విశేష మేమిటంటే
ఈ ప్రముఖ హాస్యరచయితల పేర్లలో "నరసింహ" వుండటం 
 హాస్యబ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారు తమ నాటికలు,
రచనల ద్వారా హాస్యాన్ని పండించారు. ఆయన తనయుడు
శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ గారు రాజమండ్రి సిటీ హై స్కూల్లో
మా గురువు గారు. ఆయనచాలా హాస్యనాటికలు రచించారు.
బ్రహ్మచారి, మొ"చిత్రాలకు కధ మాటలు సమకూర్చారు.
1959-60 లలో శ్రీ ముళ్లపూడి వెంకటరమణగారు   " ఇద్దరు
అమ్మాయిలు-ముగ్గురు అబ్బాయిలు","ఋణానందలహరి",
"విక్రమార్కు మార్కు సింహాసనం" "బుడుగు-చిచ్చులపిడుగు"
లాటి ఎన్నో హాస్య రచనలు చేశారు. ఆయన కూర్చిన "నవ్వితే
నవ్వండి-మాకభ్యంతరం లేదు" జోకుల పుస్తకం ఈనాటికీ
పాఠకులకు తనివితీరని పుస్తకంగా నిలిచిపోయింది.


టీవీ సీరియల్స్ వచ్చాక  పుస్తకపఠనం తగ్గిపోయింది. కానీ
ఇటీవల పుస్తకపఠనంపై పాఠకులు శ్రర్ధచూపించడం శుభ
సూచకం. స్నేహితులకూ, ఆత్మీయులకు మనం అనేక
సంధర్బాలలో ఇచ్చే కానుకలకోసం గిఫ్ట్ హౌస్ లకు పరుగు
తీయకుండా ఓ మంచి పుస్తకాన్ని కానుకగా అందించడం
అలవాటు చేసుకోవాలి .
        నా కొత్త పుస్తకాలు ఎవ్వరికీ ఇవ్వను-అవిప్పుడు
        మీకు పుస్తకాల షాపుల్లో దొరుకుతాయి కనుక.....
        అలానే నా పాత పుస్తకాలూ ఎవ్వరికీ ఇవ్వను-
        అవిప్పుడు నాకు ఎక్కడా  దొరకవు కనుక !!
              ఇదే నా పుస్తకాల గురించి నేను చెప్పే సుభాషితం.
నా పుస్తకాల గదిలోకి ఓ దొంగ ప్రవేశిస్తున్నట్లు ప్రముఖ  నా
కార్టూనిస్ట్ మిత్రులు డా" జయదేవ్ బాబు గారు తయారు
చేసిన ఫొటో కార్టూన్.

Monday, 15 April 2013

            ప్రముఖగాయకుడు, రచయిత,స్వరకర్త ఇక లేరన్న
వార్త  అభిమానులకు పెనువిషాదం.పిబియస్ అని 
పిలిచే ఆయన పూర్తి పేరు ప్రతివాద భయంకర
శ్రీనివాస్. గోదావరి తీరాన వెలిసిన మరో ఆణిముత్యం
మన శ్రీనివాస్. భక్తి గీతం నుంచి, హాస్యగీతం వరకూ
ఎటువంటి పాటనైనా పాడగల మధుర గాయకుడు
శ్రీ పిబియస్.


ఆయన పుట్టింది కాకినాడ ఐనా అనేక భాషలలో
వేల పాటలు పాడి అన్ని ప్రాంతాల శ్రోతల 
హృదయాలలో ఎనలేని స్ఠానాన్ని సంపాదించు
కున్నారు. అక్కినేని, రామారావులకు ఘంటసాల
పాడే రోజుల్లో ఆఇద్దరు హీరోలకీ తన గాత్రాన్ని
అందిచారు. అలానే ఆ రోజుల్లో కాంతారావు,జగ్గయ్య,
హరనాధ్ లకు అనేక మధురమైన పాటలు పాడారు.
ఓహో గులాబి బాలా (మంచిమనిషి), మదనకామ
రాజు చిత్రంలో నీలి మేఘాలలో, మనసే మందిరం
చిత్రంలో తలచినదే జరిగినదా పాట,ఎవరికి ఎవరు
కాపలా (ఇంటికి దీపం ఇల్లాలే) కొన్ని మరువలేని
గీతాలు. మైభీ లడ్కీ హూ( నాదీ ఆడజన్మ హిందీ
వర్షన్)లో లతా మంగేష్కర్ తో కలసి పాడారు.ఆయన
పాడిన సంస్కృత భక్తిగీతాలు LP Record గా 1973లో
విడుదలయింది. తమిళనాడు ప్రభుత్వం ఆయనకు
కళైమణి బిరుదునిచ్చి తనను తాను గౌరవించుకుంది. 
ఆయనను సత్కరించుకొనే అదృష్టం మన తెలుగు
వాళ్ళు నోచుకోలేదు.
(శ్రీ పి.బియస్. పెన్సిల్ స్కెచ్ శ్రీ యస్.శంకరనారాయణ
గారి సౌజన్యంతో)
  • Blogger news

  • Blogroll

  • About