

                      హాస్యం ఎక్కడినుంచో పుట్టదు. మనం రోజూ చూస్తున్న మన
                      చుట్టూ వున్న జనం నుంచే పుడుతుంది. మేం బాంకులో
                      పని చేసే రోజుల్లో బాంకవగానే ఇంటికి వెళ్ళేటప్పుడు మితృ
                      లంతా పుష్కర్ ఘాట్ దగ్గర వున్న "పంచవటి" హోటల్లో
                      కాసేపు గడిపేవాళ్ళం ప్రొప్రయిటర్ విశ్వేశ్వరరావు కూడా
                      మా దగ్గర కూర్చొని కబుర్లు చెప్పే వారు. అప్పట్లో రాజమండ్రి
                      పరిసారార్లో ఏ సినిమా షూటింగ్ జరిగినా హిందీ తారలు, 
                      తెలుగు తారలు అక్కడే దిగేవారు. ఒక సారి ఓమితృడు
                      విశ్వేశ్వరరావుని "ఏమండీ, మీ కస్టమర్లని వాష్ బేసిన్ 
                      కడగమని మరీ బోర్డు పెట్టడం ఏం బాగుంది?" అంటూ
                      అడిగాడు. అలా ఎక్కడ పెట్టామండీ? అన్నాడాయన.
                      "ఇదుగో చూడండి! ఇక్కడ ఏం బోర్డుందో!  "వాష్ బేసిన్" 
                      అంటే కడగమనే కదా, అర్ధం" అనగానే ఆయన విరగబడి
                      నవ్వాడు. మరో సారి టిఫిన్ చేసి హోటల్ పోర్టికోలో
                      నిలబడ్డాం. ఎస్సెస్వీ.సుబ్బారావనే మా కొలీగ్ ఫోల్డింగ్
                      చెయిర్ కొని వెంట తెచ్చుకున్నాడు. కష్టమర్లు తిరుగు
                      తుండే ఆ బిజీ పోర్టికోలో మధ్యగా దారికి అడ్డంగా తన
                      కొత్త కుర్చీ వేసుకొని కాలిమీదకాలు వేసుకూర్చున్నాడు.
                      నేను " అదేమిటి, సుబ్బారావు ,దారిలో కూర్చున్నావు.?
                      ఎవరైనా చూస్తే బాగుండదు కదా?" అన్నాను. "ఎందుకు
                      బాగోదు? నా కొత్త కుర్చీ, నా ఇష్టం" అన్నాడు. "ఐతే ఎదురుగా
                      వున్న ఆ రోడ్డు మీద ఇలా కూర్చోగలవా?" అనగానే "ఎంత
                      పందెం?" అని కుర్చీ తీసుకొని రోడ్డుకు సెంటర్లో వేసుకొని
                      కూర్చొని ,కుర్చీ తీసుకు వచ్చి మళ్ళీ వచ్చి పోర్టికోలో
                      కూర్చున్నాడు ఆ రోడ్డు కూడలి. అటు కోటగుమ్మం వైపు
                      నుంచి, గోదావరి బండ్ నుంచి పెద్దఆంజనేయస్వామి గుడి
                      వైపుగా వచ్చే బిజీ దారి. ఇలా ప్రాక్టికల్ జోకులు వేసుకొనే
                      వాళ్ళం. నేను ఆఫీసర్ అని వాళ్ళు ఎవార్డు స్టాఫ్ అనె తేడా
                      వుండేది కాదు. ఆ రోజులు అలా హాపీగా బ్యాంకులో గడిచాయి.
                      అసలు సిసలైన ఓ ప్రాక్టికల్ జోకుతో ముగిస్తా. నన్ను బ్రాంచి
                      మేనేజర్ గా ప్రొమోట్ చేసి కోనసీమలోని ఓ బ్రాంచికి వేశారు.
                      బ్రాంచి ఎలా వుంటుందో చూద్దాము రండి అంటూ మా కొలీగ్
                      కేయస్.వెంకటేశ్వర రావు నన్నో రోజు ఉదయాన్నే స్కూటర్
                      మీద ఆ ఊరికి తీసుకు వెళ్ళాడు. బ్రాంచికి వెళ్ళి బియమ్
                      రెసిడెన్స్ బ్రాంచి మీదే కదా అని ఇద్దరం వెళ్ళాము. బియమ్
                      అబ్బాయి వచ్చి" మీరెవరండీ?"అని అడిగాడు. మా కేయస్
                      "ఇన్నీస్పేట(రాజమండ్రి లో ఓ బ్రాంచి) నుంచి వచ్చాము "అని 
                      చెప్పమన్నాడు. ఆ అబ్బాయి లోపలికి వెళ్ళి ఏం చెప్పాడో
                      కాని, వెంటనే మాకు రాచమర్యాదలు ప్రారంభమయ్యాయి.
                      ఇంట్లోవాళ్ళంతా కంగారుపడటం మాకు తెలుస్తూనే వుంది.
                      కొద్ది సేపట్లొనే వేడి వేడి టిఫినీలు, కాపీలు వచ్చాయి. తరువాత
                      ఆ బ్రాంచి మేనేజరుగారు నీట్ గా తయారయి బయటకు వచ్చి
                      మమ్మల్ని చూసి ఆశ్చర్యపడి, వెంటనే లేచి సర్దుకొని,"మరి మా
                      అబ్బాయితో అలా చెప్పారేం?" అన్నాడు. "ఏం చెప్పాడండి,మీ
                      అబ్బాయి" అని ఒకే సారి అడిగాం. " మీరు బాంకు ఇన్సెపెక్టర్సు
                      అని చెప్పారటగా?" అన్నాడు. అప్పుడు మాకు అర్ధమయింది !
                      రాచమర్యాదలు అన్నీ ఎందుకు చేశాడో! మేమన్నాం"మీ వాడు
                      సరిగా విని వుండడు.మేం ఇన్నీస్పేట నుంచి వచ్చాం" అని చెప్పా
                      మన్నాము.ఆయన మరో సారి ఆశ్చర్యపడ్డాడు!. తరువాత ఆయన 
                      వాళ్ళ అబ్బాయికీ మర్యాద బాగా చేసి వుంటాడని అనుకున్నాం.
                      ఇది 1983 సంవత్సరం లో జరిగింది.ఇన్నేళ్ళు గడిచినా ఆ
                      నాటి విషయాన్ని తలచుకొని నేనూ, మా కేయస్ తెగ నవ్వు
                      కుంటాం!! ఇప్పుడా "పంచవటి"హోటల్  లేదు.ఐనా అటువేపు
                      వెళ్ళినప్పుడల్లా ఆనాటి జ్ఞాపకాలు మదిలో మెదులుతాయి.!





+(1).jpg)






















 
 
 
 
 
 
 
 
 








